
DNews:24 Dec: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. తమకు రావాల్సిన వేతన సవరణ బకాయిల కోసం సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న రిటైర్డ్ అధికారులకు అనుకూలంగా సాక్షాత్తు గౌరవ హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, నేటికీ ఆ నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. సుమారు 500 మందికి పైగా రిటైర్డ్ అధికారులకు సంబంధించి దాదాపు 63 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వేతన సవరణ జరిగిన సమయంలో రిటైర్డ్ అధికారులకు కొంత మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా, యాజమాన్యం దీనిపై మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తోంది. దీనిని సవాలు చేస్తూ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, బాధితులకు రావాల్సిన వాటాను వెంటనే చెల్లించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయితే కోర్టు గడువు విధించినప్పటికీ సింగరేణి యాజమాన్యం నిధుల విడుదలలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని రిటైర్డ్ అధికారుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమకు, వైద్య ఖర్చుల కోసం ఈ నిధులు ఎంతో అవసరమని, కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయడం యాజమాన్య అహంకారానికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికే కోర్టు తీర్పు కాపీని అధికారులకు అందజేసినా, ఫైళ్ల కదలికలో చలనం లేకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి ఈ 63 కోట్ల రూపాయలను విడుదల చేయని పక్షంలో, తాము మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. సంస్థ అభివృద్ధి కోసం తమ జీవితాలను ధారపోసిన తమ పట్ల ఇలాంటి మొండి వైఖరి ప్రదర్శించడం సరికాదని, తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
