
DNews:18 Mar: హనుమకొండ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్ప సముదాయంలో తండ్రి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో సజీవదహనమయ్యారు. మృతులను రాజశేఖర్ (54), ఆయన కుమార్తె రాజశ్రీ (24)గా పోలీసులు గుర్తించారు. బ్లాక్ నంబర్ 10లోని వారి నివాసంలో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. రాజశ్రీకి 2023లో ప్రవీణ్ అనే యువకుడితో వివాహం జరగ్గా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రవీణ్ వారిద్దరిపై డీజిల్ పోసి నిప్పు పెట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మాడికొండ పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
