
DNews:05 Jan: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని విడదీస్తూ, చారిత్రక సికింద్రాబాద్ గుర్తింపును చెరిపేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు. సికింద్రాబాద్ అంటే కేవలం ఒక పిన్ కోడ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్లో గీసిన గీత కాదని, అది 200 ఏళ్ల సజీవ చరిత్ర అని ఆయన గుర్తుచేశారు. 1806లో పురుడుపోసుకున్న ఈ నగరం తనకంటూ ఒక ప్రత్యేక సంస్కృతిని, పౌర ఆత్మను కలిగి ఉందని పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణ అనే ముసుగులో సికింద్రాబాద్ పేరును తుడిచివేయాలని చూడటం లేదా దాన్ని వేరే విభాగాల్లో కలపడం సాంస్కృతిక విధ్వంసమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచినంత మాత్రాన సికింద్రాబాద్ పౌర అస్తిత్వాన్ని మార్చే హక్కు ముఖ్యమంత్రికి లేదని ఆయన ఆరోపించారు. మల్కాజిగిరి పేరుతో ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, సికింద్రాబాద్ సరిహద్దులను బలవంతంగా మార్చడం నియంతృత్వ ధోరణి అని విమర్శించారు. కేవలం పరిపాలనా సౌలభ్యం పేరుతో తరతరాల చరిత్రను కాలరాయడం సరికాదని, సికింద్రాబాద్ జోలికి వస్తే ఇక్కడి ప్రజలే కాకుండా చరిత్ర కూడా ప్రతిఘటిస్తుందని శ్రవణ్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనలపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్రవణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
