
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో మరోసారి భూప్రకంపనలు భయాందోళనలు రేకెత్తించాయి. దక్షిణ ద్వీపంలోని టె అనౌ పట్టణ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. టె అనౌకు ఉత్తరాన సుమారు 40 కిలోమీటర్ల(24.85 మైళ్ల) దూరంలో భూకంప కేంద్రం ఉందని న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.
మరోవైపు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS), జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ఈ భూకంప తీవ్రతను 5.9గా వెల్లడించాయి. భూమికి 50 కిలోమీటర్లకు పైగా లోతులో భూకంపం సంభవించినట్లు నిర్ధారించాయి. కాగా, ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే, సునామీ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను న్యూజిలాండ్ ప్రభుత్వం హెచ్చరించింది.
