
DNews:22 Nov:హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం, తెలంగాణలో రాగల రెండు రోజులు (ఆదివారం, సోమవారం) వర్షాలు కురిసే అవకాశం ఉంది. మలక్కా జలసంధిలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, శనివారం ఉదయం 8.30 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిణామాల కారణంగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాలలో పొడి వాతావరణం ఏర్పడి, పొగమంచు కురిసే అవకాశం కూడా ఉంది. సోమవారం సైతం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని, అయితే మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కేంద్రం వివరించింది.
