
DNews:30 Apr: హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు చేపట్టిన మెరుపు నిరసన ఈ ఉద్రిక్తతకు దారితీసింది. గత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి స్వయంగా ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడంతో ఆగ్రహించిన ఉద్యమకారులు ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
తమకు న్యాయం చేస్తామని నమ్మబలికి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండన్నరేళ్లు గడిచినా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఉద్యమకారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చేతుల్లో చిప్పలు పట్టుకుని భిక్షాటన చేస్తూ గాంధీ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అప్రమత్తమై వారిని ప్రధాన ద్వారం వద్దే అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసులు ఉద్యమకారులను లోపలికి వెళ్లకుండా నిలువరించి, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
బీఆర్ఎస్ హయాంలో తాము తీవ్ర అన్యాయానికి గురయ్యామని, కాంగ్రెస్ పాలనలోనైనా తమ బతుకులు మారుతాయని ఆశించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం తమను విస్మరించిందని ఉద్యమకారులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం అలుముకుంది. ఈ నిరసన నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
