
DNews:16 Mar: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా నేడు ఉదయం హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి మరియు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు భారీ నిరసన చేపట్టారు.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్లకార్డులను ప్రదర్శించారు. ముఖ్యంగా “ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి”, “రాహుల్ బంధు కాదు.. మాకు రైతుబంధు కావాలి” మరియు “రైతులకు వెన్నుపోటు – రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు” అంటూ రాసి ఉన్న ప్లకార్డులతో వారు నినాదాలు చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని, విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయవద్దని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నిరసన అనంతరం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి గన్పార్క్ నుండి అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు.
