
DNews:09 Feb: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇష్టారాజ్యంగా దూషిస్తున్న కాంగ్రెస్ నాయకులకు కాలం దగ్గరపడిందని ఆయన హెచ్చరించారు. “కేసీఆర్ను నోటికొచ్చినట్లు తిట్టిన వాళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం.. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం” అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదని, కేవలం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. భూపాలపల్లి గడ్డపై జరుగుతున్న అభివృద్ధి అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, ఇప్పుడున్న నాయకులు కేవలం శిలాఫలకాలకు రంగులు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో బిజీగా ఉందని, సామాన్య ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయిస్తే చూస్తూ ఊరుకోమని, అధికార బలంతో రెచ్చిపోతున్న వారికి ప్రజలే ఈ మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెబుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.
