
DNews:12 Mar: తెలంగాణలో కొత్తగా నియమితులైన వేలాది మంది లైసెన్స్డ్ సర్వేయర్లు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,000 మందికి పైగా సర్వేయర్లు నెలల తరబడి తమకు అటు పని, ఇటు వేతనం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ స్థానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి విధానం కింద తమకు లైసెన్స్లు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి పని కేటాయింపులు జరగలేదని వారు ఆరోపించారు. నిత్యం ఎంఆర్వో కార్యాలయాలకు హాజరవుతున్నా ఎటువంటి బాధ్యతలు అప్పగించకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చిందని వారు వాపోయారు. సర్వేయర్ల సమస్యలను సావధానంగా విన్న కేటీఆర్, శిక్షణ పొంది లైసెన్స్లు పొందిన యువతను ఇలా వదిలేయడం అన్యాయమని మండిపడ్డారు. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తి, బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు.
