
అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సీఈఓ నియామకానికి సంబంధించి త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ పదవి కోసం 5,300 మందికి పైగా దరఖాస్తులు రాగా.. వారిలో ఇంటర్వ్యూకు 18 మందిని ఎంపిక చేసినట్లు ట్రస్టు వర్గాలు వెల్లడించాయి. మంగళ, బుధవారాల్లో ఆలయ ప్రాంగణంలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేదీ, శ్రీ షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు మాజీ చైర్మన్ సురేశ్ హవారే సభ్యులుగా ఉన్న ప్యానెల్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయనుంది. సీఈఓగా 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తిని నియమించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హిందూ మతాన్ని ఆచరించే, శాకాహారం పాటించే వ్యక్తులనే ఈ బాధ్యతకు ఎంపిక చేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
రామమందిరానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను సీఈఓ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇటీవల రామమందిర విరాళాల చోరీ వ్యవహారం వెలుగులోకి రావడంతో.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకంగా సీఈఓను నియమించాలని ట్రస్టు నిర్ణయించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. విరాళాల చోరీపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో శుక్లా వద్ద నుంచి అత్యధికంగా రూ.20.39 లక్షలు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వారి నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
