
DNews:NOV 12:జగిత్యాల జిల్లా విదేశీ నేలపై విషాదం చోటు చేసుకుంది. బహ్రెయిన్లో పనిచేస్తున్న జగిత్యాల టౌన్ కృష్ణా నగర్కు చెందిన యువకుడు అనుమాండ్ల కల్యాణ్ (26) పుట్టిన రోజునే ఆత్మహత్యకు పాల్పడడం హృదయ విదారకంగా మారింది.కల్యాణ్ బహ్రెయిన్లో కార్వాష్ క్లీనర్గా పని చేస్తున్నాడు. అతని రూంమేట్స్ కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబానికి సమాచారం అందించారు. నిన్న పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా మాట్లాడిన కల్యాణ్ ఈ రోజు మృతి చెందాడనే వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
దాదాపు 10 నెలల క్రితం బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లిన కల్యాణ్, తక్కువ జీతంతో జీవనం సాగించడంలో ఇబ్బందులు పడుతున్నాడు. వర్కింగ్ వీసా మార్పు కోసం కొంతమందికి డబ్బులు చెల్లించగా, వారు మోసం చేసినట్లు తెలిసింది. దీంతో గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కల్యాణ్ తల్లి వెల్లడించింది.
ఈ మోసం కారణంగానే కల్యాణ్ ప్రాణాలు తీసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కల్యాణ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సహాయం కోరుతున్నారు.బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు మృతదేహంగా వస్తున్నాడనే వార్త గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది.
