
DNews:27 Nov:కాచిగూడ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ తీవ్రమైన కేసులో నాంపల్లి 12వ అదనపు సెషన్స్ జడ్జి కీలక తీర్పును వెలువరించారు. మైనర్ బాలికైన తన మనుమరాలుపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడికి న్యాయస్థానం 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు రూ. 10,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు కాచిగూడ ఇన్స్పెక్టర్ టి. జ్యోత్స్న వివరాలను వెల్లడించారు.బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుదారురాలు తన భర్త మరణానంతరం, రెండేళ్ల కుమార్తెతో కలిసి మొదట తన అత్త మహేందర్ కౌర్ కుటుంబంతో కలిసి తిలక్నగర్లో నివాసం ఉండేది. మే 2024లో ఆమె వేరే ఇంటికి మారినప్పటికీ, అప్పుడప్పుడూ తన కుమార్తెను పాత ఇంటి వద్ద వదిలి వెళ్లేది.
జూన్ 16, 2024న, ఆ బాలిక అన్యమనస్కంగా ఉండటం గమనించిన తల్లి, వెంటనే వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షల ద్వారా బాలికపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారణ అయింది. ఈ ఘటనకు బాధ్యుడిగా ఆమె అత్తగారి కుటుంబ సభ్యుడైన, బాలికకు తాత వరసయ్యే సర్దార్ త్రిలోక్ సింగ్ను అనుమానించి, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు అందిన వెంటనే కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిపై సమగ్ర దర్యాప్తు జరిపారు. సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలతో నిందితుడిపై చార్జ్ షీట్ దాఖలు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.
కేసు విచారణ చేపట్టిన నాంపల్లి 12వ అదనపు సెషన్స్ జడ్జి, నిందితుడు సర్దార్ త్రిలోక్ సింగ్ను దోషిగా నిర్ధారించారు. బుధవారం వెలువరించిన ఈ తీర్పులో కోర్టు…నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.రూ. 10,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.నిందితుడు జరిమానా చెల్లించని పక్షంలో, అదనంగా మరో 6 నెలల సాధారణ శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.మనుమరాలుపైనే లైంగిక దాడికి పాల్పడిన ఈ దుర్మార్గానికి న్యాయస్థానం ఈ కఠిన శిక్ష విధించడం ద్వారా, ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి గట్టి హెచ్చరిక పంపిందని పోలీసులు తెలిపారు.
