
అబూజా (నైజీరియా): నైజీరియాలో మరోసారి ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. దేశంలోని నైజర్ రాష్ట్రంలో ఓ నది మీద ప్రయాణిస్తున్న ప్రయాణికుల పడవ బోల్తా కొట్టడంతో కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇంకా పలువురు గల్లంతైనట్లు సమాచారం.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదం సంభవించిన పడవలో సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పడవలో సామగ్రి, బైకులు, వాణిజ్య సరుకులు కూడా ఉన్నందున అది ఎక్కువ బరువుతో నడుస్తున్నదని, అదుపు కోల్పోయి మునిగిపోయిందని విచారణలో తేలింది.
రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు 60 మృతదేహాలు వెలికితీసినట్లు, ఇంకా కొంతమంది కోసం గాలింపు కొనసాగుతోందని నైజర్ రాష్ట్ర అత్యవసర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
నైజీరియాలో ఇలాంటి పడవ ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. నదుల మీద రవాణా ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పడవలకు అనుమతించిన కంటే ఎక్కువ ప్రయాణికులను ఎక్కించడం, లైఫ్ జాకెట్లు లేకపోవడం వంటి కారణాల వల్ల పెద్దఎత్తున ప్రాణనష్టం జరుగుతుందని అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పలు సార్లు హెచ్చరించాయి.
ఈ ప్రమాదంపై నైజీరియా అధ్యక్షుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ, బాధితులకు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
