
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత 32 నెలల్లో గణనీయమైన పురోగతి సాధించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని ఆయన వెల్లడించారు. తాజా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలను ఉటంకిస్తూ.. తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే సుమారు 91 శాతం అధికంగా ఉందని సీఎం పేర్కొన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని చెప్పారు.
తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు.. ప్రజల ఆదాయాలు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులను పెంచే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం వెల్లడించారు. తెలంగాణను దేశంలోనే మరింత బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
