
DNews:09 Dec: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) రాత పరీక్షను నిర్వహించడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎత్తి చూపారు. డిసెంబర్ 14న జరగనున్న పరీక్షను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈరోజు హైకోర్టు సీనియర్ న్యాయవాది శివ శేఖర్ నేతృత్వంలో న్యాయవాదుల బృందం హరీశ్ రావును కలిసి వినతిపత్రాన్ని అందించింది. 118 ఏపీపీ పోస్టుల భర్తీ కోసం డిసెంబర్ 14న రాత పరీక్ష నిర్వహించాలనే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, అదే రోజు గ్రామ పంచాయతీ పోలింగ్ ఉండటంతో వేలాది న్యాయవాదుల ఓటు హక్కు ప్రభావితమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
4 వేల మంది న్యాయవాదులు ఈ పరీక్షకు హాజరవుతున్నారని, పరీక్షా కేంద్రాలు హైదరాబాద్లో ఉండగా వారి ఓటర్లు తమ స్వగ్రామాల్లో ఉన్నారని హరీశ్ రావు వివరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష సాగడంతో అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుందని ఆయన హెచ్చరించారు.“రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉండాలి. పరీక్ష పేరుతో న్యాయవాదులను ఓటింగ్ నుండి దూరం చేయడం అన్యాయం.” అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, డిసెంబర్ 14న జరిగే ఏపీపీ పరీక్షను వాయిదా వేసి మరో తేదీకి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాదులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని కోరారు.
