
D news Spl: Oct 18: మానవ జీవితంలో నలభై, యాభై ఏళ్ల మధ్య దశ అత్యంత కీలకమైనది, సంక్లిష్టమైనది. దీనిని పశ్చిమ దేశాల్లో మిడ్-లైఫ్ క్రైసిస్ (మధ్య వయసు సంక్షోభం) అని పిలుస్తారు. ఈ దశలో మగవారు, ఆడవారు తీసుకునే మానసిక మలుపులు, వారి వైవాహిక జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి. ఈ వయసులో భార్యాభర్తల ఆలోచనలు రెండు వ్యతిరేక దిశల్లో పయనించడం గమనించదగ్గ విషయం.
మగాడి మలుపు: నిరాశలోకి ప్రయాణం
నలభై ఐదు దాటిన మగవారిలో జీవితం పట్ల ఒక విధమైన నిరాశావహ లాలసత్వం ఆవహిస్తుంది. శారీరక ఉత్సాహం, ముఖ్యంగా సెక్స్ పట్ల ఉత్సాహం తగ్గడం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. తమ యవ్వనం దాటిపోయిందనే భయం, వృద్ధాప్యం సమీపిస్తోందనే ఆందోళన వారిని చుట్టుముడతాయి.
దీని ఫలితంగా వారి దృష్టి డబ్బు సంపాదించడంపై, స్థిరత్వంపై మళ్లుతుంది. “ఇంకేముందిలే, యాభై వస్తున్నాయి,” “పిల్లలు పెద్దోళ్లయ్యారు” అనే నిట్టూర్పులతో, తమకు ఇంకా మిగిలి ఉన్న ఉన్న కాస్త యవ్వనాన్ని వారే చేజేతులా సంకనాకించుకుంటారు. ఈ దశలో, కుటుంబంలో సరసం, సరదాలకు బదులుగా, కోపం, పొగరు ప్రదర్శించడం, ఆర్థిక విషయాలపై మాత్రమే ఆందోళన చెందడం మగాడి అలవాటుగా మారుతుంది. ఈ వైఖరే భార్యాభర్తల మధ్య మానసిక దూరాన్ని పెంచుతుంది.
ఆడది: కొత్త స్వేచ్ఛ వైపు పరిణతి
మగవారి నిరాశకు భిన్నంగా, నలభై దాటిన స్త్రీలలో ఒక కొత్త యుగం మొదలవుతుంది. శారీరకంగా, మానసికంగా వారు మరింత పరిణతి చెందుతారు. యుక్తవయస్సులో కుటుంబం, పిల్లల పెంపకంలో పడ్డ ఒత్తిడిని తట్టుకుని, ఈ వయసుకి ఆమె రాటుదేలిపోతుంది. ఆటుపోట్లు తట్టుకునే ధైర్యం, మనశ్శాంతి ఆమెకు అధికమవుతాయి.
ఈ పరిణతి ఆమెకు భావ వ్యక్తీకరణ చేయగల సత్తాను, అన్యాయాన్ని ఎదిరించగల ధైర్యాన్ని ఇస్తుంది. పెళ్లికి ముందు ప్రేమ కోసం పోరాడిన స్త్రీ, పిల్లలు పెద్దయ్యాక స్వేచ్ఛ కోసం, తనకంటూ ఒక గుర్తింపు కోసం పోరాడడం మొదలుపెడుతుంది. “పడుకోగానే గురక, లేచాక పని తప్ప నేనున్నానని ఏనాడైనా గుర్తించావా?” అంటూ భర్తను నిలదీసే స్థాయికి చేరుకుంటుంది. తన కోరికలు, అవసరాలు తీరకపోతే భర్తను ప్రశ్నించడానికి, అస్సలు నచ్చకపోతే దూరంగా పెట్టడానికి కూడా ఆమె వెనుకాడదు.
సంఘర్షణ: రెండు వ్యతిరేక ధ్రువాల మధ్య
ఈ దశలో భార్యాభర్తల మధ్య సంభాషణలు, సంబంధాలు పూర్తిగా వైరుధ్యాలతో నిండి ఉంటాయి.
భర్త దృష్టి: “నాకు డబ్బు ముఖ్యం, నా శ్రమను గుర్తించు.”
భార్య దృష్టి: “డబ్బుతో పాటు సరదా, ప్రేమ కూడా ముఖ్యం. నన్ను మనిషిగా గుర్తించు.”
మగాడి పొగరు తాత్కాలికం. అనుమానం, అశ్రద్ధ, ఆర్థికపరమైన ఆందోళనలతో అతను క్రమంగా కుటుంబాన్ని నాశనం చేసుకుంటాడు, చివరికి ఒంటరి అవుతాడు.
కానీ, స్త్రీ నైజం భిన్నమైనది. ఆమె బాధ్యత స్వీకరిస్తుంది, భర్తతో సంబంధం నచ్చకపోతే, కేవలం గొడవపడి ఊరుకోదు. తనను అనాథను చేసిన భర్తను, ఒంటరిని చేయడానికి ఒక ప్రణాళికతో కూడిన పరిపక్వత ఆమె సొంతం.
మరోవైపు, స్త్రీకి లొంగి, ఆమె మూడ్ను అర్థం చేసుకునే కొద్దిమంది మగవారిని సమాజం “పెళ్ళాం కాళ్ళ కాడ కుక్క” అంటూ చిన్నచూపు చూస్తుంది. ఆడది ఎప్పుడూ ఎలా ఉంటుందో చెప్పలేని విధంగా ఆమె మనస్తత్వం సంక్లిష్టంగా ఉంటుంది.
మధ్య వయసు మలుపు అనేది ఒకరి పరిణతికి, మరొకరి మాసిపోవడానికి వేదిక. ఈ సంక్లిష్ట సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి మార్పులను మరొకరు అర్థం చేసుకోగలిగితేనే, ఈ జీవితపు అత్యంత ప్రమాదకరమైన మలుపును విజయవంతంగా దాటగలుగుతారు. లేదంటే, వారి జీవితాలు విడివిడిగా, ఒంటరిగా పయనించక తప్పదు.
