
DNews:07 OCT:హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా, ఈ నెల 4న యూసుఫ్గూడలో ఆయన స్వయంగా ఓటర్లకు ఓటర్ కార్డులు పంపిణీ చేసినట్టు గుర్తించబడింది.
ఈ వ్యవహారాన్ని జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పోలీసులు భారతీయ చట్టాల బీఎన్ఎస్ సెక్షన్లు 170, 171, 174 మరియు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఎలక్షన్ కమిషన్ ప్రకారం, ఓటర్కు గుర్తింపు కార్డులు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అఫీసర్ ద్వారా మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లోనైనా, ఎల్లప్పుడూ ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదంతో, అధికారిక అనుమతి పొందిన ఏజెన్సీలు మాత్రమే ఓటర్ కార్డులు ముద్రించి పంపిణీ చేయవచ్చు.
అయితే, నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ స్వయంగా ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై పలు రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
సోమవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల క్రమంలో, ఎన్నికల అధికారులు మరింత సీరియస్గా ఈ కేసును పరిశీలిస్తున్నారు.
