
DNews: 28 Nov: ఆ అబ్బాయి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతోంది. ఖచ్చితంగా చెప్పాలంటే.. ఆమెకు 14 సంవత్సరాలు.. అతనికి 13 సంవత్సరాలు.. తెలియని వయసులో ఉన్న ఆకర్షణ కారణంగా వారిద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి పారిపోయారు. దానికి అడ్డుగా! విజయవాడలో బస్సు ఎక్కి.. హైదరాబాద్లో దిగారు. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఈ మైనర్లకు చివరికి ఏమైంది? వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఇంటి నుండి పారిపోయారు. మొదట, తాను స్కూల్కు వెళ్తున్నానని చెప్పి.. ఆ అమ్మాయి.. అబ్బాయి ఇంటికి వెళ్ళింది. ఆ రోజు అబ్బాయి పుట్టినరోజు కావడంతో.. ఇద్దరూ కేక్ కట్ చేసి.. సాయంత్రం రూ.10 వేలు, ఫోన్ తీసుకుని హైదరాబాద్కు బస్సు ఎక్కారు.
పాఠశాల సమయం ముగిసినా, బాలిక తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని అడిగారు. ఆమె పాఠశాలకు రాలేదని, ఆమె స్నేహితుల నుండి కూడా ఎటువంటి సమాచారం లేకపోవడంతో, వారు కృష్ణ లంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన తర్వాత, పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. బాలిక పాఠశాల యూనిఫాంలో బాలుడితో కనిపించింది. ఇంతలో, ఫిర్యాదు మేరకు బాలుడి తల్లిదండ్రులు కూడా స్టేషన్కు వచ్చారు, వారిద్దరూ కలిసి వెళ్లినట్లు తేలింది. బాలుడు తీసుకున్న ఫోన్ స్విచ్ ఆన్ చేయడంతో, లొకేషన్ హైదరాబాద్లో ఉన్నట్లు తేలింది. పోలీసులు వెంటనే హైదరాబాద్కు బయలుదేరారు.
బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్లోని వనస్థలిపురంలో దిగిన మైనర్లు ఆటోలో తుక్కగూడకు వచ్చారు. అద్దెకు ఇల్లు వెతుకుతుండగా, ఒక ఆటో డ్రైవర్ వారిని గమనించి వారిద్దరినీ తన ఇంటికి తీసుకెళ్లి వివరాలు విచారించాడు. అతను వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఇంతలో, పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని వారిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చి అప్పగించారు.
