
‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ గుర్తింపు సొంతం చేసుకున్న కన్నడ స్టార్ హీరో యశ్.. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’ (Toxic) ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో గతంలో నిర్మాత అల్లు అరవింద్ తనపై చేసిన వ్యాఖ్యల గురించి ఓ ఇంటర్వ్యూలో యశ్ స్పందించారు. ‘కేజీఎఫ్’ తన కెరీర్ను పూర్తిగా మార్చేసిన సినిమా అని ఆయన పేర్కొన్నారు.
ఒక సినిమా విజయం వల్ల హీరోకే ఎక్కువ పేరు రావడంపై యశ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘కేజీఎఫ్’ కారణంగా తనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే సినిమా సక్సెస్ను ఒక్క నిర్మాతకో, హీరోకో మాత్రమే ఆపాదించలేమని అన్నారు.
“ఒక సినిమా విజయానికి ఎంతోమంది కృషి ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి రచయితల వరకు ప్రతి ఒక్కరూ తమ వంతు కష్టపడితేనే మంచి ఫలితం వస్తుంది. ముఖ్యంగా ప్రధాన పాత్రలో నటించే వ్యక్తి తన పాత్రకు న్యాయం చేయకపోతే సినిమా విజయవంతం కావడం కష్టం. ప్రేక్షకుల తీర్పును ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. వారు ప్రతి ఒక్కరి పనిని గమనిస్తారు. ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎవరు దానికి అర్హులో వారికి బాగా తెలుసు” అని యశ్ తెలిపారు.
అలాగే కొన్నిసార్లు ప్రేక్షకులు హీరోను మాత్రమే ఎందుకు ఎక్కువగా ఆదరిస్తారో తనకూ అర్థం కాదని యశ్ అన్నారు. అయితే ప్రేక్షకులు ఇచ్చే తీర్పు మాత్రం ఎప్పుడూ సరైనదేనని అభిప్రాయపడ్డారు.
ఇక సినిమా ఫలితం స్టార్ హీరోల కెరీర్పై ఎంతటి ప్రభావం చూపుతుందో కూడా యశ్ వివరించారు. ఎంత పెద్ద స్టార్ అయినా అతని తలరాతను శుక్రవారం విడుదలయ్యే సినిమా నిర్ణయిస్తుందని అన్నారు. సినిమా సరిగ్గా ఆడకపోతే పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ కూడా ఎక్కువ కాలం నిలవదని పేర్కొన్నారు.
కాగా, 2023లో ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న అల్లు అరవింద్.. ‘కేజీఎఫ్’కు ముందు యశ్ గురించి ఎంతమందికి తెలుసంటూ వ్యాఖ్యానించారు. సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించడం వల్లే దానికి అంతటి క్రేజ్ వచ్చిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో యశ్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా యశ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ పాత అంశాన్ని తెరపైకి తెచ్చాయి.
