
D Spiritual: Sept 10: గణేశుడినే ముందుగా ఎందుకు పూజిస్తారు? ఆసక్తికరమైన పురాణ కథ ఇదే
హిందూ సంప్రదాయంలో ఏదైనా శుభకార్యం లేదా కొత్త పని ప్రారంభించే ముందు గణేశుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతిని భక్తులు కొలుస్తారు. అందుకే పెళ్లి, గృహప్రవేశం, వ్యాపార ప్రారంభం, పూజలు వంటి శుభకార్యాల్లో ముందుగా గణేశుడిని స్మరించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు 14న సోమవారం గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే గణేశుడికే ఈ ప్రత్యేక గౌరవం ఎందుకు లభించింది? దీని వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ కథ ఉంది.
దేవతల మధ్య మొదలైన పోటీ
పురాణ కథనం ప్రకారం.. ఒకసారి దేవతల మధ్య ‘ముందుగా ఎవరిని పూజించాలి?’ అనే విషయంపై వివాదం ఏర్పడింది. దీనికి పరిష్కారం కోసం దేవతలంతా శివపార్వతులను ఆశ్రయించారు. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడు. “మీలో ఎవరు ముందుగా విశ్వమంతా చుట్టి తిరిగి నా వద్దకు చేరుకుంటారో.. వారినే ముందుగా పూజించాలి” అని ప్రకటించాడు.
శివుడి మాటలు విన్న వెంటనే దేవతలంతా తమ తమ వాహనాలపై విశ్వ ప్రదక్షిణకు బయలుదేరారు. కార్తికేయుడు కూడా తన వాహనం నెమలిపై వేగంగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రతి ఒక్కరూ తామే విజయం సాధిస్తామని భావించారు.
గణేశుడి తెలివైన ఆలోచన
అయితే గణేశుడి వాహనం ఎలుక. ఇతర దేవతల వాహనాలతో పోలిస్తే అది నెమ్మదిగా ప్రయాణిస్తుంది. దీంతో విశ్వాన్ని చుట్టి రావడం తనకు సాధ్యం కాదని గణేశుడు గ్రహించాడు. అయితే ఆయన నిరాశ చెందకుండా తన బలాన్ని కాకుండా తెలివిని ఉపయోగించాడు.
గణేశుడు తన తల్లిదండ్రులైన శివుడు, పార్వతుల వద్దకు వెళ్లి భక్తితో నమస్కరించాడు. అనంతరం వారి చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేశాడు. ఇది గమనించిన శివుడు.. “నువ్వు విశ్వాన్ని చుట్టి రాకుండా మా చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేశావు?” అని ప్రశ్నించాడు.
తల్లిదండ్రులే సమస్త విశ్వం
అప్పుడు గణేశుడు వినయంగా సమాధానమిచ్చాడని పురాణ కథనం. “తల్లిదండ్రుల పాదాల వద్దే సమస్త విశ్వం ఇమిడి ఉంది. కాబట్టి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే విశ్వం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే” అని చెప్పాడు.
గణేశుడి సమాధానం విన్న శివపార్వతులు ఎంతో సంతోషించారు. అక్కడున్న దేవతలు కూడా ఆయన జ్ఞానం, సమయస్ఫూర్తి, తల్లిదండ్రుల పట్ల ఉన్న భక్తికి ఆశ్చర్యపోయారు. గణేశుడు తన తెలివితో పరీక్షలో విజయం సాధించాడని భావించారు.
అందుకే గణపతిని ముందుగా పూజిస్తారు
గణేశుడి భక్తి, జ్ఞానం, సమయస్ఫూర్తికి సంతోషించిన శివుడు ఆయనకు ప్రత్యేక వరం ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మూడు లోకాలలో ఏ శుభకార్యం ప్రారంభమైనా ముందుగా గణేశుడినే పూజించాలని శివుడు వరమిచ్చాడని విశ్వాసం.
గణపతిని ముందుగా స్మరించి పూజించడం ద్వారా కార్యాల్లో ఎదురయ్యే విఘ్నాలు తొలగి విజయసిద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే నేటికీ ఏ శుభకార్యమైనా “శ్రీ గణేశాయ నమః” అంటూ గణపతిని ముందుగా స్మరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
గణేశుడి కథ ఇచ్చే సందేశం
గణేశుడి పురాణ కథ భక్తితో పాటు ఓ ముఖ్యమైన సందేశాన్ని కూడా అందిస్తుంది. సమస్యను ఎదుర్కొన్నప్పుడు కేవలం బలాన్ని నమ్ముకోవడం కాకుండా.. తెలివి, జ్ఞానం, సమయస్ఫూర్తితో ఆలోచిస్తే విజయాన్ని సాధించవచ్చనే విషయాన్ని ఈ కథ తెలియజేస్తుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం, భక్తి కూడా మన జీవితంలో ఎంత ముఖ్యమో గణేశుడి కథ వివరిస్తుంది.
