
D Spiritual: Nov 24: ప్రకృతిలో పెరిగే అనేక రకాల మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. పూర్వకాలంలో ఇలాంటి మొక్కలను ఉపయోగించి ఎన్నో వ్యాధులను నయం చేసేవారు. ప్రస్తుతం కూడా మనం పనికిరావని భావించే పిచ్చి మొక్కలను సైతం ఔషధ తయారీలో ఉపయోగిస్తున్నారు. ఇటువంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో నందివర్ధనం ఒకటి. చాలామంది ఈ మొక్కను ఇంట్లో పెంచుతారు. ముఖ్యంగా దీనిపూలను పూజల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే—ఈ పూలు, ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.
ముఖ్యంగా కంటి సమస్యలను తగ్గించడంలో నందివర్ధనం పూలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఫోన్, ల్యాప్టాప్ వంటి డిజిటల్ పరికరాలతో ఎక్కువసేపు గడపడం వల్ల కంటి అలసట, ఎర్రదనం, కంటినొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సందర్భాల్లో నందివర్ధనం పూలను నీటిలో ముంచి పావుగంటసేపు కళ్లపై ఉంచితే కంటి అలసట తగ్గుతుంది. అదేవిధంగా నాలుగు గంటల పాటు పూలను నీటిలో నానబెట్టి ఆ నీటితో కళ్లను శుభ్రం చేసుకోవడం కూడా కంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఈ పువ్వుల నుండి వచ్చే పాలు గాయాలకు ఎంతో మంచి మందుగా పనిచేస్తాయి. గాయం అయిన ప్రదేశంలో ఈ పాలను రాసినట్లయితే గాయం త్వరగా మానుతుంది. అలాగే నందివర్ధనం ఆకులతో కషాయం తయారు చేసి తాగితే అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కూడా ఈ పువ్వులు ఉపయోగపడతాయని ఆయుర్వేదం చెబుతుంది.
ఇక నందివర్ధనం వేర్లలో కూడా శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. పంటి నొప్పితో బాధపడేవారు నందివర్ధనం వేర్లు నమలితే పంటి నొప్పి తగ్గుతుంది. ఈ విధంగా నందివర్ధనం మొక్క మొత్తం ఆరోగ్యానికి మేలు చేసే సహజ ఔషధంగా పనిచేస్తుంది.
