
D Spiritual: May 2: శింగనమల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి కళ్యాణం నిర్వహించకపోవడంపై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తున్నామని స్వామి భక్తుడు కొప్పెర్ల నాగవర్ధన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా గ్రామస్తులు కులమతాలకు అతీతంగా ఐకమత్యంగా శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి కళ్యాణం మరియు రథోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు.
తొమ్మిది రోజులపాటు గ్రామంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రాతిదూలం లాగు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించేవారని ఆయన వివరించారు. అయితే ఈ సంవత్సరం గత 20 రోజులుగా ప్రజా ప్రతినిధులు మరియు దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి కళ్యాణం నిర్వహణ విషయం తీసుకెళ్లినప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని వారు సూచించారని తెలిపారు.
కళ్యాణ ఏర్పాట్లు పూర్తయ్యాక స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించబోమని అధికారులు చెప్పడం భక్తులను నిరాశకు గురిచేసిందని అన్నారు. గ్రామస్తుల మనోభావాలు మరియు సంప్రదాయాలను గౌరవించని దేవాదాయ శాఖ అధికారులపై సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
