
DSports 26 Nov: టీమ్ ఇండియా టెస్టుల్లో ప్రదర్శిస్తున్న పేలవ వైఖరిపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ పరోక్షంగా కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత్ కష్టాల్లో పడిన నేపథ్యంలో, వికాస్ కోహ్లీ తన సోషల్ మీడియా వేదిక (థ్రెడ్స్)పై ఒక పోస్ట్ చేశారు. “ఒకప్పుడు విదేశీ గడ్డపై కూడా గెలవడానికి ఆడేవాళ్ళం. కానీ ఇప్పుడు భారత్లోనే మ్యాచ్ను సేవ్ చేసుకోవడానికి ఆడుతున్నాం. ఏదైతే చెడిపోలేదో, దాన్ని అనవసరంగా మార్చడానికి ప్రయత్నించినప్పుడు, పెత్తనం (Boss Around) చేయాలని చూసినప్పుడు ఇలాగే జరుగుతుంది” అని ఆయన కామెంట్ చేశారు. ఈ పోస్ట్లో వికాస్ ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఇది టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ఉద్దేశించే అన్నారని క్రికెట్ విశ్లేషకులు మరియు అభిమానులు భావిస్తున్నారు. గంభీర్ కోచింగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టెస్ట్ క్రికెట్లో భారత్ స్థిరంగా రాణించలేకపోవడం, ముఖ్యంగా స్వదేశంలో కూడా ఓటములు ఎదురవ్వడంపై ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి.
