
D News: Jul 14: వియత్నాం పడవ ప్రమాదం – ఆంధ్రప్రదేశ్ బాధితులు: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు మృతదేహాలు మంగళవారం ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. కార్గో టెర్మినల్కు తీసుకొచ్చిన మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితుల స్వస్థలాలకు మృతదేహాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ ప్రమాదంలో మరణించిన వారిని కడప జిల్లాకు చెందిన శ్రీధర్, కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన రవితేజగా అధికారులు గుర్తించారు. వియత్నాం నుంచి మృతదేహాలను భారత్కు తరలించేందుకు అవసరమైన చట్టపరమైన, దౌత్యపరమైన ప్రక్రియలను ముందుగా ముంబైలో పూర్తి చేశారు. అనంతరం అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చి అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి వారి దుఃఖంలో పాలుపంచుకున్న ఆయన, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలైన కడప, మచిలీపట్నం, హిందూపురానికి తరలించే ప్రక్రియను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. ఈ ప్రయాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.
విదేశాల్లో జరిగిన ఈ విషాద ఘటనలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తదుపరి అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
