
DSports 15 Nov:ఆసియా క్రికెట్ మండలి పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20-2025 టోర్నమెంట్లో భారత్-ఎ జట్టు శుభారంభం చేసింది. దోహా వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో భారత్ ఏకంగా 148 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 297 పరుగుల భారీ స్కోరు సాధించింది. 14 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. టీ20 క్రికెట్లో భారతీయ ఆటగాడు సాధించిన సంయుక్త రెండో వేగవంతమైన సెంచరీ ఇదే కావడం విశేషం. మొత్తం 42 బంతులు ఎదుర్కొన్న వైభవ్, 11 ఫోర్లు, 15 సిక్సర్లతో కలిపి 144 పరుగులు చేశాడు. వైభవ్ ఔటైన తర్వాత కెప్టెన్ జితేశ్ శర్మ కూడా చెలరేగి కేవలం 32 బంతుల్లోనే 83 పరుగులు చేసి స్కోరును 300కు చేరువ చేశాడు.
అనంతరం 298 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యూఏఈ జట్టు తడబడింది. భారత బౌలర్లు గుర్జన్ప్రీత్ సింగ్ (3/18), హర్ష్ దూబే (2/12)ల ధాటికి యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 149 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్-ఎ జట్టు 148 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
