
DNews: Mar 02: హైదరాబాద్లోని అంబర్పేట్లో జరిగిన కుటుంబ ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 24న రాంరాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్ రాజ్ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత మూర్తి మీడియాకు వివరాలు తెలియజేశారు. రాంరాజ్ మల్లాపూర్, చక్రిపురం ప్రాంతంలో “కింగ్స్ బిర్యానీ” హోటల్ నడుపుతూ, వ్యాపారం కోసం సుమారు రూ.57 లక్షలు పలువురి వద్ద నుంచి అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని అధిక వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ, నల్ల చెక్కులు, ప్రామిసరీ నోట్లు, భూమి అసలు పత్రాలు తీసుకుని తీవ్రంగా వేధించారు. ఆ వేధింపులు ఆత్మహత్య జరిగిన రోజున కూడా కొనసాగడంతో రాంరాజ్ భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మృతుడి కుమార్తె అమూల్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాంరాజ్ రాసిన సూసైడ్ నోట్లో పేర్లు ఉన్న నలుగురు నిందితులను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టైన వారు మహమ్మద్ వాసి, రాజశేఖర్ రెడ్డి, మహమ్మద్ నవాజ్, సయ్యద్ మజీద్ అని డీసీపీ తెలిపారు. ప్రజలు అధిక వడ్డీతో హ్యాండ్ లోన్లు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
