
D Spiritual: Jan 5: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం ప్రణయ కలహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ ఉత్సవంలో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకిపై మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అమ్మవార్లు చెరో పల్లకిపై అప్రదక్షిణ మార్గంలో వచ్చి స్వామివారికి ఎదురుగా నిలిచారు.
పురాణ పఠనం జరుగుతుండగా, అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లను స్వామివారిపై మూడుసార్లు విసిరి వేశారు. దీనికి స్వామివారు బెదిరినట్లుగా నటిస్తూ తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడ్డారు.
అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి తిరిగి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందాస్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు.
అనంతరం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రణయ కలహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఆరో రోజు వైకుంఠ ద్వార దర్శనాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని చెప్పారు.
ప్రత్యేకంగా ఐదో రోజు శనివారం దాదాపు 89 వేల మందికి దర్శనం కల్పించినట్లు వెల్లడించారు. ఇందులో సర్వదర్శనానికి వచ్చిన సామాన్య భక్తులకు ఏఐ టెక్నాలజీ సాయంతో క్యూలైన్లలో ప్రవేశించిన 12 గంటల్లోపే దర్శనం కల్పించినట్లు పేర్కొన్నారు.
అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ క్యూలైన్ల నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాయని, భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
జనవరి 8వ తేదీ వరకు ఇదే విధంగా భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.
