
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై తిరుపతి విమానాశ్రయంలోనే ఈ-వీసా సేవలు పొందే అవకాశం కలగనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశీ ప్రయాణికులకు తిరుపతి చేరుకోవడం మరింత సులభతరం కానుంది.
ఇప్పటివరకు విదేశాల నుంచి తిరుపతికి వచ్చే భక్తులు ముందుగా చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ విమానాశ్రయాలకు చేరుకోవాల్సి వచ్చేది. అక్కడ ఈ-వీసా ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం రోడ్డు మార్గం లేదా ఇతర రవాణా సదుపాయాల ద్వారా తిరుపతికి ప్రయాణించేవారు. ఈ ప్రక్రియ వల్ల సమయం, అదనపు ప్రయాస రెండూ ఉండేవి.
ఇక తిరుపతిలోనే ఈ-వీసా సేవలు
తాజా నిర్ణయంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని ఈ-వీసాకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకునే వెసులుబాటు కలగనుంది. దీంతో శ్రీవారి దర్శనం కోసం విదేశాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇబ్బందులు కూడా కొంతమేర తొలగనున్నాయి.
అయితే విదేశీ ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 10 రోజుల ముందే ఆన్లైన్లో ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తిరుపతి ఎయిర్పోర్టులో ఈ-వీసా సేవలు అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్ సంబంధిత ప్రక్రియలు మరింత సులభంగా మారనున్నాయి.
అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంకేతాలా?
ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవడం లేదు. అయినప్పటికీ కేంద్ర పౌర విమానయాన శాఖ తిరుపతి ఎయిర్పోర్టులో ఈ-వీసా కౌంటర్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీంతో భవిష్యత్తులో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2007లోనే అంతర్జాతీయ హోదా
తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే ప్రక్రియ దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. 2007లో కేంద్ర కేబినెట్ తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. అనంతరం 2017లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ అయింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయంలో ఈ-వీసా సేవలను అందుబాటులోకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు నేరుగా తిరుపతికి చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో తిరుపతి నగరానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు, ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.
