
D Educt: Sept 18: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత చదువులు పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సూర్యాపేట జిల్లా కోదాడలో సెప్టెంబర్ 19న ప్రతిష్ఠాత్మకంగా మెగా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
సూర్యాపేట కలెక్టరేట్లో సెప్టెంబర్ 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది హుజూర్నగర్లో నిర్వహించిన ఉద్యోగ మేళా విజయవంతం కావడంతో ఈసారి కోదాడలో మరింత భారీ స్థాయిలో మెగా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఉద్యోగ మేళాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుమారు 300 ప్రముఖ కంపెనీలను ఆహ్వానించినట్లు మంత్రి తెలిపారు. ఐఫోన్, మైక్రోసాఫ్ట్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో ఆసుపత్రులు, ఎల్అండ్టీ వంటి ప్రముఖ సంస్థలు మేళాలో పాల్గొంటాయని చెప్పారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మెగా ఉద్యోగ మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ముందుగా kodadmegajobmela.com పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్పవార్, ఎస్పీ నరసింహ, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ వేణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
