
D Spiritual: Jan 24: జనవరి 25న తిరుమలలో నిర్వహించనున్న రథ సప్తమి వేడుకలను భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి (Venkaiah Chowdary) తెలిపారు. రథ సప్తమి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి వెంకయ్య చౌదరి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో రథ సప్తమి కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీలు, అన్నప్రసాదాల పంపిణీకి తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రథ సప్తమి సందర్భంగా తిరుమలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. భక్తుల భద్రత, వివిధ విభాగాల మధ్య సమన్వయం, ప్రవేశం మరియు నిష్క్రమణ మార్గాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేసినట్లు వెల్లడించారు.
గ్యాలరీల్లో కూర్చునే భక్తులు ఎండ, వర్షం వంటి పరిస్థితుల వల్ల ఇబ్బంది పడకుండా పందిళ్లు ఏర్పాటు చేసినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులు సురక్షితంగా, ప్రశాంతంగా వేడుకలను వీక్షించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్రతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
