
D Spiritual: Jan 24: తెలంగాణలోని కొండగట్టు ఆలయం ముందు అర్చకులు నిరసనకు దిగారు. ఆలయ ఈవో (Executive Officer) వ్యవహార తీరుకు వ్యతిరేకంగా అర్చకులు దేవాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా ఈవో తీసుకుంటున్న నిర్ణయాలు, పాలనా విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని అర్చకులు తెలిపారు. ఆలయ సంప్రదాయాలు, అర్చకుల హక్కులను విస్మరిస్తూ ఈవో వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.
సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసన కొనసాగుతుందని అర్చకులు స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈవో వ్యవహార శైలి కారణంగా ఆలయ అర్చకులు, ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని వారు పేర్కొన్నారు.
ఈవోపై తక్షణ విచారణ చేపట్టాలని, అలాగే ఆలయ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని అర్చకులు డిమాండ్ చేశారు. నిరసన తీవ్రతరమవడంతో భద్రతా చర్యలలో భాగంగా పోలీసులు ఆలయ పరిసరాల్లో మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆలయ ఈవోగా శ్రీకాంతరావు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందని కొంతమంది భక్తులు తెలిపారు. సిఫారసులకు తావు లేకుండా పారదర్శకమైన సంస్కరణలు అమలు చేస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు.
