
DSports 19 Nov : భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ టీమిండియాలో పెరుగుతున్న ‘వర్క్లోడ్ మేనేజ్మెంట్’ విధానంపై, ముఖ్యంగా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్కు దూరంగా ఉండటంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల కోల్కతా టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్నర్ల బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు విఫలమవడం చూసి, దీనికి ప్రధాన కారణం ఆటగాళ్లు రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడకపోవడమేనని ఆయన స్పష్టం చేశారు. “మన ఆటగాళ్లలో చాలా మంది దేశీయ క్రికెట్ ఆడటం లేదు. అక్కడ ఆడితే ఇలాంటి స్పిన్ పిచ్లపై అనుభవం వస్తుంది. రంజీలో నాకౌట్ల కోసం బంతి టర్న్ అయ్యే పిచ్లు తయారుచేస్తారు, కానీ మన ప్లేయర్లు ఆ పిచ్లపై ఆడటం లేదు” అని గావస్కర్ ప్రశ్నించారు. ఆటగాళ్లు ‘వర్క్లోడ్’ అనే పదాన్ని ఒక సాకుగా (Excuse) వాడుకుంటున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. “వాళ్లకు ఆడాలని లేదు, అందుకే వర్క్లోడ్ అనే పదాన్ని వాడుతున్నారు. కేవలం ఫామ్ కోల్పోయినప్పుడు మాత్రమే రంజీ ట్రోఫీ ఆడటానికి వస్తారు, మిగతా సమయాల్లో దానివైపు చూడరు” అని గావస్కర్ వ్యాఖ్యానించారు. ఈ ‘వర్క్లోడ్’ అనే పదాన్ని భారత క్రికెట్ నిఘంటువు నుంచి పూర్తిగా తొలగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దేశం కోసం ఆడేటప్పుడు చిన్న చిన్న నొప్పులను పట్టించుకోకుండా, సరిహద్దుల్లోని జవాన్లు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో పనిచేస్తున్నారో గుర్తుంచుకోవాలని ఆయన ఆటగాళ్లకు హితవు పలికారు.
