
D News: Jul 13: జులై 14న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్కు ABVP పిలుపు
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ల విడుదలలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ జులై 14 (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్కు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) పిలుపునిచ్చింది. జూనియర్ కళాశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్కు సహకరించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు కోరారు.
తెలంగాణలో సుమారు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లపై ఆధారపడి ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఫీజుల విడుదలలో నిర్లక్ష్యం వహించడంతో రూ.11 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.
ప్రభుత్వ వైఖరి కారణంగా ప్రతి ఏడాది రెండు లక్షల మంది పేద విద్యార్థులు చదువు మధ్యలోనే మానేస్తున్నారని, చదువు పూర్తయిన లక్షలాది మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు.
ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వం కలిసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయని ABVP ఆరోపించింది. ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
జులై 14న చేపట్టే రాష్ట్రవ్యాప్త కాలేజీల బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, విద్యాభిమానులు సహకరించి విజయవంతం చేయాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది.
