
D Spiritual: Jul 13: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని పురాతన సాంబమూర్తి ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆలయ గర్భగుడిలో శివుడి విగ్రహం, నాగదేవత విగ్రహాల ఎదురుగా తెల్లటి శ్వేతనాగు (తెల్లని త్రాచుపాము) ప్రత్యక్షమవడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వచ్చిన సోమవారం రోజున ఈ ఘటన జరగడంతో దీనిని చాలామంది శుభసూచకంగా, శివుడి మహిమగా భావిస్తున్నారు.
ప్రతిరోజు మాదిరిగానే నిత్యపూజలు నిర్వహించేందుకు ఆలయ పూజారి గర్భగుడిలోకి వెళ్లగా, నాగదేవత విగ్రహాల ఎదురుగా తెల్లటి పాము ప్రశాంతంగా ఉండటాన్ని గమనించారు. తొలుత ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన పూజారి, అనంతరం ఆ పాము ఎలాంటి హాని చేయకుండా నిశ్శబ్దంగా ఉండటంతో ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించారు.
శ్వేతనాగు దర్శనం విషయం తెలిసిన వెంటనే రచ్చపల్లి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వందలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి శ్వేతనాగును దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆరుద్ర నక్షత్రం, సోమవారం రోజున సాంబమూర్తి ఆలయంలో శ్వేతనాగు దర్శనమివ్వడం శుభసూచకమని భక్తులు విశ్వసిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే పాము ఒక అడవి జీవి కావడంతో దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంరక్షించాలని స్థానికులు సూచిస్తున్నారు. భక్తులు మాత్రం దీనిని దైవ మహిమగా భావించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
