
D Spiritual: Jul 10: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు-2026 తేదీలు ఖరారు కావడంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. తిరుమల పద్మావతి అతిథిగృహంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న అంకురార్పణతో వేడుకలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 15న ధ్వజారోహణం నిర్వహించనుండగా, వాహన సేవలను ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవను సెప్టెంబర్ 19న నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 22న శ్రీవారు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వగా, సెప్టెంబర్ 23న శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. సెప్టెంబర్ 18 రాత్రి 9 గంటల నుంచి 20 తెల్లవారుజాము 6 గంటల వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లలో అన్నప్రసాదాల పంపిణీ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో మరుగుదొడ్ల పరిశుభ్రత కోసం అదనపు సిబ్బందిని నియమించనున్నారు. విద్యుత్ దీపాలంకరణలు, పుష్ప, ఫల ప్రదర్శనలతో తిరుమల క్షేత్రాన్ని సుందరంగా అలంకరించనుండగా, భక్తులకు సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తున్నారు. లడ్డూల నిల్వలు, ఇంజినీరింగ్ పనులు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పనిచేస్తోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులు ముందస్తు ప్రణాళికతో తిరుమలకు రావాలని సూచించారు.
