
D Spiritual: Aug 25: శ్రీశైలం దర్శనం టికెట్లు: సెప్టెంబర్ కోటా విడుదల
శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు దేవస్థానం పాలకమండలి శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను దేవస్థానం అధికారులు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు 90 శాతం టికెట్లను ఆన్లైన్ ద్వారానే కేటాయిస్తున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దీంతో భక్తులు ఇంటి నుంచే తమకు అవసరమైన సేవలు, దర్శన టికెట్లను ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
దర్శనానికి గంట ముందు వరకు బుకింగ్
శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు దేవస్థానం మరో సౌకర్యాన్ని కల్పించింది. స్వామివారి దర్శనానికి కేవలం ఒక గంట ముందు వరకు కూడా ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో చివరి నిమిషంలో వచ్చే భక్తులకు కూడా దర్శన టికెట్ల విషయంలో వెసులుబాటు కలగనుంది.
‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా ఈజీ బుకింగ్
టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు దేవస్థానం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. భక్తులు ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తమకు అవసరమైన సేవా, దర్శన టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చు.
అలాగే ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ అధికారిక పోర్టల్ tms.ap.gov.in ద్వారా కూడా ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం ఉంది. భక్తులు తమ ప్రయాణ ప్రణాళికకు అనుగుణంగా ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
దళారులను నమ్మొద్దు
టికెట్ల కొనుగోలు విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. దళారులు, మధ్యవర్తులను నమ్మి టికెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని హెచ్చరించారు.
దర్శన, ఆర్జిత సేవల టికెట్ల కోసం కేవలం దేవస్థానం సూచించిన అధికారిక వాట్సాప్ నంబర్ లేదా అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అధికారిక మార్గాల్లోనే టికెట్లు బుక్ చేసుకుని సురక్షితంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచించారు.
