
D Spiritual: Mar 13: శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్ర సమస్యగా మారింది. వారం రోజులుగా గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆలయ కార్యకలాపాలు, హోటళ్లు మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వరుని ప్రసాదాల తయారీకి గ్యాస్ అందకపోవడం పెద్ద సమస్యగా మారింది. గురువారానికి భక్తులకు అందించే లడ్డు, వడ, జిలేబి వంటి ప్రసాదాల తయారీ కూడా ఇబ్బందిగా మారింది. అయితే నిత్యాన్న ప్రసాదం, స్వామి-అమ్మవార్ల నైవేద్యం మాత్రం ఎంతో కష్టపడి తయారు చేస్తున్నారు.
కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా పుణ్యక్షేత్రంలోని పెద్ద హోటళ్లతో పాటు అనేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా మూతపడిపోయాయి. దీంతో వ్యాపారాలు దెబ్బతిని వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయంలో రోజూ ప్రసాదాల తయారీకి సుమారు 22 గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తారు. అదనంగా నిత్యాన్నదాన పథకం కోసం మరో 10 సిలిండర్లు ఉపయోగిస్తారు.
అయితే వారం రోజులుగా గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్లను సరఫరా చేయకపోవడంతో నిల్వ ఉన్న సిలిండర్లను ఆలయ అధికారులు పొదుపుగా వినియోగించారు. పోటు అధికారి హరియాదవ్ ఎంతో జాగ్రత్తగా వాడినా గురువారానికి గ్యాస్ పూర్తిగా ఖాళీ అయింది. దీంతో ఆలయ నిర్వహణలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశు గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ సమస్యకు తక్షణ పరిష్కారం లభించలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసి వంట చేయాలని సిబ్బందికి ఆదేశించారు.
