
DSports 15 Nov:భారత్-సౌతాఫ్రికా మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టెస్ట్ మొదటి రోజు ఆటలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బవుమాకు బౌలింగ్ వేసిన తర్వాత ఎల్బీడబ్ల్యూ అప్పీల్ తిరస్కరణకు గురైన సమయంలో, రిషభ్ పంత్తో మాట్లాడే క్రమంలో బుమ్రా స్టంప్ మైక్లో “మరుగుజ్జు కదా!” (‘Bauna bhi hai’) అంటూ బవుమా పొట్టితనాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లుగా రికార్డ్ అయింది.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తగా, మ్యాచ్ అనంతరం సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ యాష్వెల్ ప్రిన్స్ దీనిపై స్పందించారు. ఈ సంఘటన గురించి తమ జట్టులో ఎలాంటి చర్చా జరగదని, దీనిపై తాము ఎటువంటి ఫిర్యాదు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. “ఈ విషయం గురించి మా జట్టులో ఎలాంటి చర్చా రాదు. భారత్ నుంచి ఇలా జరగడం ఇదే తొలిసారి. అయితే, అక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదనే అనుకుంటున్నా” అని ప్రిన్స్ మీడియాకు తెలిపారు. ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా, ఆటపైనే దృష్టి సారించాలని దక్షిణాఫ్రికా జట్టు నిర్ణయించుకున్నట్లు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది.
మొదటి రోజు ఆటలో బుమ్రా అద్భుత ప్రదర్శన చేసి 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కేవలం 159 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ, బవుమాపై బుమ్రా చేసిన వ్యాఖ్యలు మాత్రం క్రీడా స్ఫూర్తిని దెబ్బతీశాయంటూ కొందరు నెటిజన్లు విమర్శించారు.
