
DNews: Dec 03: మంగళవారం రాత్రి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) అనూహ్యంగా ఇండిగో విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీని కారణంగా ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కేరళలకు వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. మొత్తం 11 విమానాలు రద్దు కావడంతో దాదాపు 1000 మంది ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. వీరిలో 200 మందికి పైగా సబరిమల యాత్రికులు కూడా ఉన్నారు. విమానయాన సంస్థ సిబ్బంది స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో సహా కుటుంబాలు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం వల్ల తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. అంతేకాక, అంతర్జాతీయ కనెక్షన్లు కూడా దెబ్బతిన్నాయి. ఆలస్యంగా మాత్రమే వసతి కల్పించినట్లు సమాచారం. ప్రయాణికులు తమ బాధను వ్యక్తం చేస్తూ, ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
