
శాసనసభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కచ్చితంగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ 420 హామీలు, 1000 రోజుల పాలనతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై అన్ని అంశాల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా తప్పించుకునేందుకే చిల్లర డ్రామాలు, చిల్లర వేషాలు వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలంతా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని, వారికి అన్నీ అర్థమవుతున్నాయని అన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లో నిలదీసి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాలతో పాటు ఎమ్మెల్సీల విషయంపై శాసనమండలిలోనూ చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి బెదిరింపులకు, భయపెట్టే ప్రయత్నాలకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ భయపడబోరని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ మహిళా నేతలపై దాడులు చేయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని ఆయన ఆరోపించారు.
