
D Spiritual: May 7: పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వైశాఖ శుద్ధ బహుళ పంచమి సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, అధికారులు వీరికి ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. గత నెల 28 నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
మంత్రి పయ్యావుల కేశవ్ స్వామివారి ఉత్సవమూర్తుల పల్లకీని భుజాన మోసి రథం వరకు తీసుకువచ్చారు. బ్రాహ్మణుల వేదమంత్రాల మధ్య మడుగుతేరు కార్యక్రమం నిర్వహించి రథాన్ని ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు “నమో నారసింహ” అంటూ గోవింద నామస్మరణతో రథాన్ని లాగారు. ఉద్భవలక్ష్మి ఆలయం నుంచి కొండ చుట్టూ సాగిన ఈ రథయాత్ర సుమారు 40 నిమిషాల పాటు కొనసాగి తిరిగి యథాస్థానానికి చేరుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.
ఈ భారీ రథోత్సవానికి వేల సంఖ్యలో జనం రావడంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భద్రత కోసం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. రథోత్సవం అనంతరం భక్తులు ఒకేసారి తిరుగు ప్రయాణం కావడంతో అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించగా, అగ్నిమాపక శాఖ సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు.
