
D News: భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ గ్రాండ్గా ప్రారంభం కానుంది. అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన్న నటించనున్నట్లు ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే చిత్రబృందం నుంచి పూర్తి అధికారిక వివరాలు సెప్టెంబర్ 16న వెల్లడయ్యే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 16న చెన్నైలోని ది మ్యూజిక్ అకాడమీలో సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే ఇండియన్ కోరల్ ఎన్సెంబుల్ బృందం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ప్రసిద్ధ గీతాలను లైవ్గా ప్రదర్శించనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి సంగీత ప్రస్థానం, ఆమె వ్యక్తిత్వం, భారతీయ సంగీత ప్రపంచానికి చేసిన సేవలను నేటి తరానికి పరిచయం చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 16న జరిగే గ్రాండ్ లాంచ్తో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
