
DNews: Nov 20: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్ పార్టీ మారిన ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే, వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు — దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరి — ఇంకా అఫిడవిట్లు సమర్పించలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ మరోసారి వారికి నోటీసులు పంపించారు. అసెంబ్లీ స్పీకర్ స్పష్టంగా పేర్కొన్నది ఏమిటంటే, అనర్హత పిటిషన్లపై అఫిడవిట్లు తప్పనిసరిగా సమర్పించాల్సిందే.
ఇప్పటికే సుప్రీం కోర్టు ఈ కేసు విచారణ ఆలస్యం అవుతున్నదని తీవ్రంగా స్పందించి, నాలుగు వారాల గడువు విధించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించారు. రెండో దశ విచారణలో భాగంగా ఈ రోజు (గురువారం) నలుగురు ఎమ్మెల్యేలను విచారణకు పిలిచారు. ఉదయం నుంచి విచారణ ప్రారంభమైంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి కేసును స్పీకర్ విన్నారు. ఇరు పక్షాల వాదనలు వినిపించారు. మధ్యాహ్నం అరికేపూడి గాంధీ వర్సెస్ కల్వకుంట్ల సంజయ్ కేసును విచారించనున్నారు. వీరి విచారణతో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల కేసుల విచారణ పూర్తవుతుంది.
ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ AICC నేతలతో భేటీ కానున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ ఈరోజుతో ముగియనున్నప్పటికీ, దానం ఇంకా అఫిడవిట్ సమర్పించలేదు. విచారణకు హాజరైతే తాను అనర్హుడవుతానన్న భయం ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. అనర్హత విధించబడితే, ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజీనామా చేస్తే తన పరిస్థితిపై పార్టీ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
