
DSports 9 Dec:హైదరాబాద్: ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా (GOAT – Greatest Of All Time) గుర్తింపు పొందిన అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనకు రానుండడంతో దేశంలో, ముఖ్యంగా హైదరాబాద్లో మెస్సీ మేనియా పతాక స్థాయికి చేరింది. మూడు రోజుల ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా – 2025’లో భాగంగా మెస్సీ హైదరాబాద్ను సందర్శించనుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
సుదీర్ఘ కాలం తర్వాత మెస్సీ భారత్కు వస్తుండటంతో, సాకర్ ఫ్యాన్స్ తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
భారత పర్యటనలో భాగంగా మెస్సీ తూర్పు (కోల్కతా), దక్షిణం (హైదరాబాద్), పశ్చిమం (ముంబై), ఉత్తరం (ఢిల్లీ) నగరాలను కవర్ చేయడం ద్వారా దేశవ్యాప్త అభిమానులను పలకరించనున్నారు. ఢిల్లీ పర్యటనలో మెస్సీ భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మెస్సీ భారత్లో పర్యటించడం ఇది రెండోసారి. 2011లో కోల్కతాలో వెనిజులాతో జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్లో ఆయన సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఆడింది.
