
DNews: Nov 18: హైదరాబాద్: బీహార్లో ఎన్డీఏ గెలుపు ఓట్ల దొంగతనంతో సాధించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాగఠబంధన్కు ఎన్డీఏ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్డీఏ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. రాజ్యాంగ ప్రకారం ఎన్నికలు జరిగితే మహాగఠబంధన్కు 200 సీట్లు వచ్చేవని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ సంస్థగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఓట్ల దొంగతనాన్ని ఆపి, దేశాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. బీహార్లో ‘సర్’ పేరుతో లౌకిక ఓట్లు తొలగించారని, భవిష్యత్తులో తెలంగాణలో కూడా అదే పేరుతో లౌకిక ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సోమవారం గాంధీ భవన్లో ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ఓట్ల దొంగతనంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాహుల్ గాంధీ నిరంతర పోరాటం చేశారని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అధికారమే పరమమని భావించి ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారని విమర్శించారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణను ముమ్మరం చేస్తామని చెప్పారు. ఒకరి కోసం లేదా తాత్కాలిక లాభం కోసం ఓట్ల దొంగతనం చేస్తే దేశానికి నష్టం జరుగుతుందని యువతకు సూచించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనాన్ని ఆధారాలతో బయటపెట్టినా ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యువజన కాంగ్రెస్ నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉదయ్ భాను చిబ్ మాట్లాడుతూ, ప్రజల ఓట్లను దొంగిలించేందుకు ఎన్నికల సంఘంతో కలిసి మోదీ ప్రభుత్వం పనిచేయడం దారుణమని విమర్శించారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇక సంపత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడా గంజాయి మొక్కలు, కలుపు మొక్కలు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయన పేర్లు చెబితే విచారణ చేస్తామని తెలిపారు. సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇస్తూనే కొత్త నేతలకు కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. డీసీసీ అధ్యక్షుల నియామకం ఎప్పుడైనా ప్రకటించవచ్చని వెల్లడించారు.
