
DNational 16 Mar: మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఎల్పిజి (LPG) సిలిండర్ ధరల పెరుగుదలపై వ్యంగ్యంగా స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుకరించిన ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
శివపురి జిల్లాలోని పోహ్రి బ్లాక్, సెమర్ఖేడి ప్రభుత్వ పాఠశాలలో సాకేత్ పురోహిత్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల దేశంలో గ్యాస్ ధరలు పెరగడంపై ఆయన ఒక వీడియో రూపొందించారు. ఆ వీడియోలో ప్రధాని మోదీ మాట్లాడే శైలిని అనుకరిస్తూ, “గ్యాస్ ధరలు పెరగడం వల్ల ప్రజలు తిరిగి కట్టెల పొయ్యిని వాడటం ప్రారంభిస్తారని, దీనివల్ల ధనిక, పేదల మధ్య వ్యత్యాసం తగ్గుతుందని” వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పిచోర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి దేశ ప్రధానిని, ప్రజాప్రతినిధులను ఈ విధంగా ఎగతాళి చేయడం ‘సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమావళి’కి విరుద్ధమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి వివేక్ శ్రీవాస్తవ, ఉపాధ్యాయుడిపై విచారణ జరిపి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయనను బదర్వాస్ బ్లాక్ విద్యాశాఖ కార్యాలయానికి అటాచ్ చేశారు.
తన సస్పెన్షన్పై సాకేత్ పురోహిత్ స్పందిస్తూ, ఇది ఏకపక్ష నిర్ణయమని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, వివరణ కోరకుండానే నేరుగా సస్పెండ్ చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
