
D News: Aug 7: విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్: ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక రంగానికి ఊతమిచ్చే లక్ష్యంతో గూగుల్, అదానీ గ్రూప్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన స్థల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
అయితే ఈ ప్రాజెక్ట్పై స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నీటి కొరత ఎదుర్కొంటున్న విశాఖపట్నంలో డేటా సెంటర్ నిర్వహణకు అవసరమైన భారీ నీటి వినియోగం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు 20 ఏళ్ల పాటు హామీతో నీటి సరఫరా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం వివాదానికి దారితీసింది.
పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ అంశాలపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కంబలకొండ వన్యప్రాణుల అభయారణ్యానికి సమీపంలో ప్రాజెక్టు ఉండటంతో భారీ నిర్మాణాలు, శబ్ద కాలుష్యం వన్యప్రాణులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధితో పాటు ప్రజల మౌలిక అవసరాలు, పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు.
