
DNews: Feb05: విశాఖపట్నంలోని విలువైన ప్రభుత్వ భూమిని ABN ఆంధ్ర జ్యోతి సంస్థకు ఉచితంగా కేటాయించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ భూమిని ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
విశాఖపట్నంకు చెందిన నక్కా నమ్మి గ్రేస్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా, హైకోర్టు అనేక కీలక ప్రశ్నలను లేవనెత్తింది. ఏ చట్టం ప్రకారం ప్రభుత్వ భూమిని ప్రైవేట్ కంపెనీకి ఉచితంగా బదిలీ చేశారు? అని కోర్టు ప్రశ్నించింది. ఈ భూమికి సంబంధించి ఏదైనా సేల్ డీడ్ ప్రతివాద కంపెనీల పేరిట వ్రాయబడిందా అని ప్రశ్నించింది. పిటిషనర్ తరపు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తుత విధానం ప్రకారం, విలువైన భూములను ప్రైవేట్ కంపెనీలకు ఉచితంగా ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ లేదా ఇతర కారణాల వల్ల మాత్రమే ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం అవుతుందని ఆయన వాదించారు.
ఈ మేరకు ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ ఈ కేసులో పూర్తి వివరాలను సమర్పించడానికి రెండు వారాల సమయం కోరారు. అదేవిధంగా, భూమి కేటాయింపుపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యంతో సహా మిగతా ప్రతివాదులందరికీ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
