
D-News: ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కేంద్ర జల సంఘం (CWC) కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలోని సేవా భవన్లో ఈ సమావేశం జరగనుంది. CWC చైర్మన్ అధ్యక్షతన జరిగే భేటీకి తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులను ఆహ్వానించారు.
బ్యారేజీ నిర్మాణంపై ఉన్న సాంకేతిక అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించాల్సిన అంతర్రాష్ట్ర సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
152 మీటర్ల ఎత్తుకు తెలంగాణ పట్టుదల
తుమ్మిడిహట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. గతంలో మహారాష్ట్రతో 148 మీటర్ల ఎత్తుపై అంగీకారం కుదిరింది. అయితే ఆ ఎత్తులో అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
148 మీటర్ల వద్ద నీటిని తరలించేందుకు పెద్ద మొత్తంలో పంపింగ్ చేయాల్సి వస్తుందని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉందని రాష్ట్రం కేంద్రానికి వివరించింది. అదనపు విద్యుత్ భారం లేకుండా దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరేలా బ్యారేజీ నిర్మాణం జరగాలని తెలంగాణ వాదిస్తోంది.
కేంద్ర జోక్యాన్ని కోరిన సీఎం
తుమ్మిడిహట్టి అంశంపై రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిపి పరస్పర అంగీకారానికి రావాలని తెలంగాణ సీఎం ఎ. రేవంత్రెడ్డి మే 26న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కోరారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
రేవంత్రెడ్డి విజ్ఞప్తిని ప్రధాని కార్యాలయం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపింది. అనంతరం కేంద్రం జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ సీఎం ఆగస్టు 5న జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు లేఖ రాశారు.
ముంపు అంశంపైనా చర్చ
బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచితే అదనపు ముంపు ఏర్పడే అవకాశంపై కూడా తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) అధ్యయనాల ప్రకారం నీటిమట్టం పెంపుతో ఏర్పడే అదనపు ముంపు ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని రాష్ట్రం తెలిపింది.
సెప్టెంబర్ 1న జరిగే CWC సమావేశంలో బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, పంపింగ్ విద్యుత్ ఖర్చు, ముంపు ప్రభావం, అంతర్రాష్ట్ర సమన్వయం వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఈ భేటీ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు భవిష్యత్ దిశపై కీలకంగా మారే అవకాశం ఉంది.
