
D News: ‘RX 100’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాడు. ‘గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’ వంటి చిత్రాల్లో విలన్గా కూడా మెప్పించిన ఆయన.. ‘బెదురులంక 2012’, ‘భజే వాయు వేగం’ తర్వాత కొత్త ప్రాజెక్టులపై పెద్దగా అప్డేట్స్ ఇవ్వలేదు. దీంతో కార్తికేయ సినిమాలకు దూరమయ్యాడంటూ సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది.
మెగాఫోన్ పట్టిన కార్తికేయ
అయితే ఈ గ్యాప్కు కార్తికేయ ఇప్పుడు సరికొత్త సమాధానం ఇచ్చాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. తన కోసం తానే ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకుని, స్వీయ నిర్మాణంలో కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నాడు.
సైలెంట్గా సినిమా ముహూర్తం
కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై రూపొందనున్న ఈ సినిమాకు బుధవారం పూజా కార్యక్రమాలతో ముహూర్తం కూడా పూర్తిచేసినట్లు సమాచారం. త్వరలోనే మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించి, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలువురు యువ హీరోలు నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు కార్తికేయ కూడా అదే బాటలో మెగాఫోన్ పట్టడంతో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి పెరిగింది. దర్శకుడిగా ఆయన తొలి ప్రయత్నం ఎలా ఉండబోతుందో చూడాలి.
